కలం, వెబ్ డెస్క్ : ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. నువ్వా? నేనా? అనే విధంగా ఇరు దేశాలు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ దాడి చేసింది. గత 20 ఏళ్లలో శత్రువుల దాడిలో అమెరికా ఫైటర్ జెట్స్ కూలిపోవడం ఇదే తొలిసారి. దీంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ఇరాన్ దేశానికి అల్టిమేటం జారీ చేశారు. తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ (Iran)కు ఇచ్చిన పది రోజుల గడువు దగ్గరపడిందని వెల్లడించారు.
”ఇరాన్కు నేను 10 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? ఒప్పందం చేసుకోవాలి లేదా హార్మూజ్ జలసంధిని తెరవాలి. సమయం ముగియనుంది. ఇంకా 48 గంటల్లో అన్నీ విధ్వంసం అవుతాయి. అంతా భగవంతుడి దయ!” అంటూ ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. దీంతో ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే ఇక ప్రళయమేనని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ తాజా ప్రకటనతో ప్రపంచ దేశాలు విస్మయం చెందుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వల్ల ఎలాంటి ఉపద్రవాలు పొంచి వస్తాయోనని ఆందోళన పడుతున్నాయి.

