కలం, మహబూబాబాద్: తమ విద్యా సంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఆందోళన చేస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనను అదుపు చేసే క్రమంలో సీఐ రఘుపతిరెడ్డి (CI Raghupathi Reddy) విద్యార్థుల గొంతు నులిమిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విద్యార్థుల గొంతును కొద్దిసేపు బిగించి పట్టుకోవడంతో వారు ఇబ్బందికి గురైనట్లు ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోల్లో సీఐ ఇద్దరు విద్యార్థులను గొంతు పట్టుకుని వెనక్కి లాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉండగా.. ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
‘హక్కుల కోసం పోరాడితే తప్పేంటి?’
తమ విద్యా భవిష్యత్తు, హక్కుల కోసం విద్యార్థులు ఆందోళన చేస్తే వారిపై భౌతికంగా వ్యవహరించడం సరికాదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ(CI Raghupathi Reddy)పై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలి.. ఖమ్మం ఎంపీ రామ సహాయం
Follow Us On: Instagram

