కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట అన్నదాతలను నిలువునా ముంచడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.
ఈ మేరకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆమె సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. రైతులకు తక్షణమే న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలని, తరుగు పేరుతో దోపిడీని అరికట్టాలని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.
సచివాలయం వద్ద ఉద్రిక్తత: కవిత అరెస్ట్
తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల సమస్యల పరిష్కారం కోసం సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన టీఆర్ఎస్ నాయకురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతులకు మద్దతుగా సచివాలయం వద్ద ధర్నాకు దిగిన ఆమెను, ఇతర నాయకులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ ధర్నాలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు, రైతులు, మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో సచివాలయ పరిసర ప్రాంతాల్లో గందరగోళం ఏర్పడింది.

