Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో భారీ చోరీ.. వ్యాపారిని బురిడీ కొట్టి రూ.50 లక్షల సొత్తు అపహరణ!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీ చౌక్ ప్రాంతంలో బంగారం వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి సుమారు రూ.50 లక్షల విలువైన బంగారం, వెండి ఉన్న బ్యాగ్‌ను అపహరించుకుపోయారు. ​వివరాల్లోకి వెళ్తే.. వంకాయల కార్తీక్ అనే గోల్డ్ షాపు యజమాని రాత్రి సమయం కావడంతో తన షాపును మూసివేసి స్కూటీపై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆయన ఒక టిఫిన్ సెంటర్ వద్ద ఆగి టిఫిన్ తింటున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. కార్తీక్ తన స్కూటీలో ఉంచిన బ్యాగ్‌ను దుండగులు అత్యంత చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. బాధితుడు గమనించే లోపే వారు అక్కడి నుంచి పరారయ్యారు.

​ఈ చోరీకి గురైన బ్యాగులో 3 కేజీల వెండి దిమ్మ, 2 కేజీల ప్యూర్ వెండితో పాటు 250 గ్రాముల బంగారు కడ్డీలు ఉన్నట్లు బాధితుడు కార్తీక్ పోలీసులకు తెలిపాడు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఈ పక్కా స్కెచ్ చూస్తుంటే, నిందితులు వ్యాపారి దినచర్యను నిశితంగా గమనించి, రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ​ఈ ఘటనపై బాధితుడు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. నడిరోడ్డుపై, రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్ వద్దే ఇంతటి భారీ చోరీ జరగడం స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>