కలం, వెబ్ డెస్క్: ఏపీ (Andhra Pradesh) ప్రజలకు ఇది నిజంగా గుడ్న్యూస్ లాంటింది. అతి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందుబాటులోకి రాబోతున్నాయి. డిమార్ట్ను మించి క్వాలిటీ సేవలను అందించబోతున్నాయి. పౌర సరఫరాల వ్యవస్థను ఆధునీకరించడం, నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీ మార్ట్ (Mee Mart)ను ప్రారంభించారు. గుంటూరు జిల్లా లాలుపురంలో రాష్ట్రంలోనే మొదటి మీ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులతో అనుసంధానిస్తూ 1,000 మినీ మార్ట్లను ఏర్పాటు చేసే ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు.
ఈ పథకం ద్వారా వినియోగదారులతోపాటు దాదాపు 30,000 మంది రేషన్ డీలర్లు లబ్ధి పొందనున్నారు. వారికి ఆర్థిక స్థిరత్వం లభించనుంది. బహిరంగ మార్కెట్ కంటే రూ.3 నుంచి రూ.5 తక్కువ ధరకే 250కిపైగా రోజువారీ నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), ఫ్రంటియర్ మార్కెట్ సప్లై చైన్ భాగస్వామ్యంతో పౌర సరఫరాల శాఖ వీటిని ఏర్పాటు చేస్తోంది. స్థానిక డిమాండ్కు అనుగుణంగా డీలర్లు వస్తువులను స్టాక్ చేసుకునే వీలుంటుంది. రేషన్ షాపుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా, ప్రజలకు తక్కువ ధరకే వస్తువులను అందించడానికి ఈ మార్ట్స్ దోహదపడుతాయి.
సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ‘మీ మార్ట్’ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రాష్ట్రంలో ప్రతిపాదించిన 1,000 మీ మార్ట్ల్లో ప్రస్తుతం 553 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

