కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లాలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలి దుమారంతో పాటు భారీ వర్షం కురవడంతో జనజీవనం కొంతసేపు స్తంభించిపోయింది. ఈ క్రమంలో జనగామ పరిధిలోని శామీర్పేట (Shamirpet) ఏరియాలో ఆకస్మికంగా పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టుపై పిడుగు పడటంతో, ఆ తీవ్ర ధాటికి ఒక్కసారిగా మంటలు అంటుకుని చెట్టు కాలిపోయింది.
పిడుగు పడిన సమయంలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పిడుగు పడిన ఘటనతో కొంతసేపు అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వర్షం, గాలి దుమారం కారణంగా కొంతకాలం విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం.

