కలం, వెబ్ డెస్క్: బెంగళూరు క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026(IPL 2026) మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేసింది. గతేడాది ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈసారి తన సొంత గడ్డపై టైటిల్ను కాపాడుకునేందుకు సిద్ధమైంది.
గతంలో ఆర్సీబీ టైటిల్ గెలిచిన సమయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని, జస్టిస్ జాన్ మైఖేల్ డికున్హా కమిటీ పలు సూచనలు చేసింది. ఈ సిఫార్సుల మేరకు కేఎస్సీఏ స్టేడియంలో భారీ మార్పులు చేపట్టింది. భద్రతను పెంచేందుకు కొత్త ఎంట్రీ గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు, పాత గేట్లను వెడల్పు చేసింది. అత్యవసర సమయాల్లో ప్రేక్షకులు సురక్షితంగా బయటకు వెళ్లేలా ప్రత్యేక వాక్వేలు, దారులను నిర్మించింది.
ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ స్టేడియంలో మాక్ డ్రిల్ నిర్వహించి, భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి 15 నాటికే పనులన్నీ పూర్తి కావడంతో ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది.
బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మార్చి 28 నుంచి ఐపీఎల్ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. తొలిసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన బలమైన జట్టుతో ఆర్సీబీ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

