కలం, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకున్నది. యమునా నది(Yamuna River)లో ప్రయాణిస్తున్న ఒక పడవ అకస్మాత్తుగా బోల్తా పడటంతో ఆరుగురు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మరికొందరు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్ల సహాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ, సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లనో లేదా సాంకేతిక లోపం వల్లనో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు నదీ తీరానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

