కలం, వెబ్ డెస్క్: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తెచ్చిన నేపథ్యంలో ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్ పే (PhonePe) కీలక ప్రకటన చేసింది. భారత్లోని తమ యూజర్లకు ఫోన్ పే సేవలు ఎప్పుడూ ఉచితమేనని.. ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కంపెనీ సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లోక్ సభలో బిల్లు పాసైన తరువాత ఈ అంశంపై స్పందించిన మొదటి పేమెంట్స్ యాప్ కంపెనీ ఫోన్ పే కావడం గమనార్హం.
కస్టమర్లలో కలవరం..
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించబోతున్నారంటూ వెలువడుతున్న వార్తలతో కస్టమర్లలో కలవరం మొదలైంది. భవిష్యత్తులో ఇది నగదు చలామణి మరింత పెరిగేందుకు దోహదపడుతుందని కూడా ఆర్థిక వేత్తలు హెచ్చరించారు. అదే జరిగితే.. డిజిటల్ చెల్లింపులు పోయి పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందన్నారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఛార్జీలు కేవలం వ్యాపార వర్గాలకు మాత్రమే అని, రూ.1.5 కోట్ల కంటే వార్షిక టర్నోవర్ అధికంగా ఉండే వ్యాపారులకు ఈ రుసుములు వర్తిస్తాయని స్పష్టం చేశారు. సాధారణ యూజర్లకు ఈ అంశంతో సంబంధమే లేదని కొట్టిపారేశారు.

