కలం, వెబ్ డెస్క్ : సహారా ఎడారి (Sahara Desert) ప్రాంతంలో ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండే అల్జీరియా–మాలీ సరిహద్దుల్లో నీటి చుక్క దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మాలీ దేశానికి చెందిన కొందరు వ్యక్తులు నైజర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో కలిసి బక్రీద్ పండుగను జరుపుకోవాలనే ఆశతో ఒక ట్రక్కులో ప్రయాణమయ్యారు. అయితే వారి ప్రయాణం సాగుతుండగా సహారా ఎడారి మార్గమధ్యలో హఠాత్తుగా ట్రక్కు చెడిపోయింది. చుట్టూ కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు తప్ప మరేమీ లేని ఆ నిర్జన ప్రదేశంలో వారు చిక్కుకుపోయారు.
సహాయం కోసం ఎదురుచూస్తూ రోజుల తరబడి ఎండ తీవ్రతకు, ఉక్కపోతకు గురయ్యారు. తాగడానికి కనీసం నీటి చుక్క కూడా దొరకకపోవడంతో తీవ్ర దాహంతో ఒకరి తర్వాత ఒకరు చొప్పున మొత్తం 49 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం నుండి ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వారు ఎడారిలో కాలినడకన అత్యంత సాహసోపేతమైన ప్రయాణం చేసి, ఎట్టకేలకు స్థానిక అధికారులను చేరుకున్నారు. వారికి జరిగిన విషయాన్ని వివరించడంతో ఈ ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టాయి. పండుగ పూట కుటుంబాలను కలవాలనుకున్న వారి ప్రయాణం ఇలా విషాదాంతం అవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

