కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ పాలనలో అన్ని రంగాలు సర్వ నాశనం అవుతున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రంగా విమర్శించారు. విదేశీ వ్యవహారాలు, దేశ భవిష్యత్తు వంటి కీలక నిర్ణయాల్లో ఘోరంగా విఫలమవుతోందన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అసలు మీరు ఎలాంటి దేశాన్ని నిర్మించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పది రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి.. ప్రజల జేబులను దోచుకుంటోందని మండిపడ్డారు. కేవలం ఎన్నికల సమయాల్లో మాత్రమే చమురు ధరలు పెంచకుండా ఆగుతున్నారని.. అవి ముగిసిన వెంటనే విడతల వారీగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమానత్వం అనే మాటే మరిచిపోయారా..?
ప్రధాని మోదీ రాజ్యాంగ సూత్రాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. సహజ న్యాయం, సమానత్వం అనే అంశాలను మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. ప్రజల నుంచి పన్నులు దోచుకుంటూ.. వాటిని వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారని దుమ్మెత్తి పోశారు. పేదలు, యువత, మహిళలు, రైతులు.. ఇలా అన్ని రంగాల ప్రజలు మోదీ పాలనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.

