కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా జక్రాన్పల్లి మండలం పడ్కాల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు చేసిన దుశ్చర్య వల్ల సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలోని ఈత వనం (Toddy Palm Trees) అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో కల్లుగీత కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయి వీధిన పడ్డారు.
పడ్కాల్ గ్రామ శివారులోని ఈతవనానికి ఎవరో కావాలనే నిప్పు పెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే తోటంతా కాలిబూడిదైంది. కష్టపడి పెంచుకున్న చెట్లు కళ్లముందే కాలిపోవడంతో గీత కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

