కలం, వెబ్డెస్క్: నేడు బుద్ధ పౌర్ణమి (Buddha Purnima)ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా బుద్ధుడిని ఆదర్శంగా అనుసరించే వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవాన్ బుద్ధుడి జననం, జ్ఞానోదయం, మహా పరినిర్యాణం వంటి ఘట్టాలకు ఈ పవిత్ర దినం సాక్ష్యమని ఆమె పేర్కొన్నారు. బుద్ధుడు బోధించిన కరుణ, అహింస, శాంతి, జ్ఞానం వంటి శాశ్వత సందేశాలు మానవాళికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయని కొనియాడారు.
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు బుద్ధుని బోధనలే పరిష్కారమని స్పష్టం చేశారు. బుద్ధుడి బోధనలు ప్రజలను శాంతి, సహనం, పరస్పర సామరస్య మార్గంలో నడిపిస్తాయని రాష్ట్రపతి తన సందేశంలో వివరించారు. ఈ శుభ సందర్భంలో బుద్ధుడి ఆశయాలను మన జీవితాల్లో భాగం చేసుకుందామని రాష్ట్ర పతి పిలుపునిచ్చారు. శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.

