కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకున్నది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (TMC MP Kalyan Banerjee)పై దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదివారం హుగ్లీ జిల్లాలోని చండితాల పోలీస్ స్టేషన్ వద్ద తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ గాయపడ్డారు.
ఘర్షణ జరిగిందిలా..
ఇటీవల తమ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ టీఎంసీ నాయకులు చండితాల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అరెస్టులపై నిరసన వ్యక్తం చేస్తూ వినతిపత్రం సమర్పించేందుకు పార్టీ ప్రతినిధి బృందం పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ బృందానికి ఎంపీ కల్యాణ్ బెనర్జీ నాయకత్వం వహించినట్లు సమాచారం. అదే సమయంలో అక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో రెండు ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు ఒకేచోట ఎదురెదురుగా నిలవడంతో పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది. ఇటీవల పశ్చిమబెంగాల్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఎంపీ అభిషేక్ బెనర్జీ మీద శనివారం దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

