కలం, వెబ్ డెస్క్ : వైసీపీ గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna) కౌంటర్ ఇచ్చారు. అవును.. చంద్రబాబు పాలిట జగన్ గొడ్డలి, కత్తి, త్రిశూలమేనని అన్నారు. చంద్రబాబును రాజకీయంగా అంతం చేసేది జగనేనని.. అందుకే వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో జరిగిన మహిళ నేతల సమావేశంలో పాల్గొన్న సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రెండేళ్లుగా చంద్రబాబు వ్యవస్థీకృత అరాచక పాలన చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు పాలనలో మహళలు ఎక్కువగా మోసపోయారన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి చేయలేదు. . ఉన్నవి లాగేసి నిలువుదోపిడీ చేశారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు 33 శాతం మహిళా రిజర్వేషన్ల పేరుతో మరో మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే మహిళలకు 50 శాతం పదవులు ఇచ్చేందుకు వైసీపీ హయాంలోనే చట్టం చేశామని గుర్తు చేశారు. జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని చెప్పుకొచ్చారు. టీడీపీకి వైసీపీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న సజ్జల.. మెగా డీఎస్సీ పేరుతో టీడీపీ నిరుద్యోగులను దగా చేసిందని మండిపడ్డారు.

