కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం తిరుమల (Tirumala)లో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీగా భక్తుల రద్దీ నెలకొంది. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 80,841 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి.
గదులు పొందే కార్యాలయాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, లడ్డూ, అన్నప్రసాద కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్ వరకు క్యూలైన్ వ్యాపించింది. అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాలు కూడా రద్దీగా మారాయి. ఆదివారం వేకువజామున 5 గంటలకు జారీ చేసే స్లాటెడ్ సర్వదర్శనం(SSD) టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్ వద్ద శనివారం మధ్యాహ్నం నుంచే భక్తులు చేరుకున్నారు.

