కలం, కరీంనగర్ బ్యూరో: రేపు బక్రీద్ పండుగ పురస్కరించుకుని కరీంనగర్ (Karimnagar) కమిషనరేట్ వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు కీలక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం క్షేత్రస్థాయిలో పర్యటించి, స్వయంగా వాహన తనిఖీలను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు బక్రీద్ పండుగను అత్యంత ప్రశాంతమైన, సోదరభావ వాతావరణంలో జరుపుకునేలా చూసేందుకే ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు. కమిషనరేట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు.

