కలం, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని చంద్రపూర్ (Chandrapur) జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదకర ఘటన చోటు చేసుకుంది. అడవిలో బీడీల ఆకులు సేకరిస్తున్న నలుగురు మహిళలపై ఒక పెద్ద పులి దాడి (Tiger Attack) చేసి వారిని చంపేసింది. ఈ ఘటన జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలో మీటర్ల దూరంలో జరిగింది. స్థానిక మహిళలంతా కలిసి అటవీ ప్రాంతానికి బీడీల ఆకులు సేకరించడానికి వెళ్లారు. వారు తమ పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో పులి ఒక్కసారిగా విరుచుకుపడిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహిళలను గుంజేవాహి గ్రామానికి చెందిన కవడడాబాయి మోహుర్లే, అనితా బాయి, సునితా బాయి, సంగీతా చౌదరిలుగా గుర్తించారు. అయితే పులి ఈ నలుగురిని ఒకే చోట దాడి చేసి చంపిందా, లేక వేర్వేరు ప్రదేశాలలో దాడి చేసిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న వెంటనే చంద్రపూర్ సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఆర్.ఎమ్. రామానుజన్ నేతృత్వంలోని అటవీ అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు, అటవీ అధికారులు పంచనామా పూర్తి చేసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఒకేసారి నలుగురు మహిళల మృతితో చంద్రపూర్ (Chandrapur) జిల్లాలో విషాదం నెలకొంది. బీడీ ఆకులు సేకరించేందుకు వెళ్లే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also: స్కూటీతో ఏనుగును ఢీకొట్టిన మహిళ.. తరువాత ఏమైందంటే?
Follow Us On: Sharechat

