కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు-భద్రాచలం ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మణుగూరు-భద్రాచలం ప్రధాన రహదారిపై ఒక ఆటో వేగంగా ప్రయాణిస్తున్న క్రమంలో తాల్లగొమ్మూరు క్రషర్ మిల్లు సమీపంలోకి రాగానే ఆటో ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆటో విపరీతమైన వేగంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

