కలం, వెబ్డెస్క్: హిమాలయాల్లోని కైలాస్ మానస సరోవరం యాత్ర (Manasarovar Yatra) హిందువులతోపాటు బౌద్ధులు, జైనులకు పరమ పవిత్రం. అత్యంత కఠిన భౌగోళిక పరిస్థితుల మధ్య ఉండే మానస సరోవరం చేరుకోవడానికి మూడో మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. శుక్రవారం లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్థన్ సింగ్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లోని షిప్కి లా పాస్ (Shipki La Pass) ను మూడో మార్గంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై చైనాతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం మానస సరోవర యాత్రకు భారత్ నుంచి రెండు అధికారిక మార్గాలు ఉన్నాయి. అవి ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథు లా పాస్. వీటి ద్వారా ఏటా వేలాది మంది మానస సరోవర యాత్రకు వెళుతున్నారు. ఈ రెండు మార్గాలకు అదనంగా మరొకటి అందుబాటులోకి తేవాలని భారత్ కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తోంది.
‘మానస సరోవరం యాత్రకు (Manasarovar Yatra) వెళ్లేవాళ్లకు మరింత సౌకర్యంగా ఉండేలా కొత్త మార్గం అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నాం. అయితే, దీనికి చైనా అంగీకరించాలి. ఇప్పటివరకు వాళ్ల నుంచి సానుకూల స్పందన రాలేదు. భారత ప్రభుత్వం మాత్రం షిప్కి లా పాస్ను మూడో మార్గంగా తెచ్చేందుకు చైనాతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది’ అని మంత్రి వెల్లడించారు.
భౌగోళికంగా టిబెట్లో ఉన్న మానస సరోవరం ప్రాంతం ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది. ఇది భారత్, నేపాల్తో సరిహద్దును పంచుకుంటోంది. ఏటా ఏప్రిల్లో కైలాస్ మానస సరోవర యాత్రకు భారత్ నుంచి వేలాది మంది వెళతారు. కాగా, ఈ ఏడాది యాత్ర ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాత్రికులకు అవసరమైన రవాణా, వసతి, ఆహారం, వైద్య సౌకర్యాలతోపాటు గైడ్లను అందుబాటులో ఉంచుతోందని కేంద్ర మంత్రి కీర్తి వర్థన్ సింగ్ తెలిపారు.
Read Also: 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
Follow Us On : WhatsApp


