కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ జేఏసీ (TGSRTC JAC) తో ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకు మాత్రమే పరిమితం కానున్నాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్లకు పరిష్కారంపై అధికారులతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె యధావిధిగా చేపట్టనున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి నాలుగు సమయం కావాలంటూ జేఏసీ ప్రతినిధులకు కమిటీ సూచించింది. కానీ గడువు ఇవ్వడానికి ప్రతినిధులు నిరాకరించారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని, ఇంతకాలం పరిష్కారానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు చొరవ తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. లేబర్ కమిషనర్కు సమ్మె నోటీసు ఇచ్చామని, ఆర్టీసీ యాజమాన్యానికి సైతం పది రోజుల క్రితమే ఇచ్చామని గుర్తుచేశారు.
సమ్మె ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే ఉండగా ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని, దీంతో సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతోందని జేఏసీ ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎలాంటి ఒత్తిడి వచ్చినా భయపడకుండా సమ్మెకు దిగుతామని కమిటీకి స్పష్టం చేశారు. ఇప్పుడు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి చర్చలు జరపడమంటే కాలయాపన చేయడం తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించారు. గత్యంతరం లేకనే సమ్మెకు దిగుతున్నామని అన్నారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. ఆర్టీసీ (TGSRTC) విభాగంలోని అన్ని కార్మిక సంఘాలకు జేఏసీ పిలుపినిచ్చింది. అన్ని డిపోల లీడర్లను సమ్మె గురించి అలర్టు చేసింది. చర్చలు జరపడంలో కమిటీకి చిత్తశుద్ధి లేదని, వింటే వినండి.. లేదంటే పొండి.. అనే తీరులో అధికారులు వ్యవహరించారని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మీడియాకు వివరించారు.
Read Also: రేపే జడ్జిమెంట్ డే.. కాళేశ్వరంపై ఏం జరగబోతుంది?
Follow Us On: Instagram

