కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పొలవాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగరాజం (61) దుబాయ్ వెళ్లాడు. ఇటీవల అక్కడ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. కోమాలోకి వెళ్లిన గంగరాజంను మెరుగైన చికిత్స కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుని.. స్వగ్రామానికి వెళ్లిన పది రోజులకే మరణించాడు.
మానవత్వమే ముఖ్యం..
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గల్ఫ్ దేశంలో మరణిస్తేనే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా లభిస్తుంది, కానీ గంగరాజం స్వదేశంలో మరణించడంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. సీఎంవో అధికారులు విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించగా.. నిబంధనల కంటే మానవత్వమే ముఖ్యమని భావించి, దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి CMRF నుంచి సాయం అందించాలని ఆదేశించారు. ఈ క్రమంలో మృతుడి భార్య రాజవ్వ, కుమారుడు జలంధర్ కు ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ డా. జి. చిన్నారెడ్డి, నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ రూ.5 లక్షల చెక్కు అందించారు.

