కలం, స్పోర్ట్స్ : హోం గ్రౌండ్లో అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. తొలి బంతి నుంచే ఊచకోత మొదలు పెట్టాడు. 135 నాటౌట్గా నిలిచి ఐపీఎల్ 2026లో ఒకే మ్యాచ్ (SRH vs DC) లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలంటే ఏంటో చూపించాడు. అభిషేక్ క్రీజ్లో ఉన్నాడంటే బాల్ వేయాలంటే బౌలర్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటే.. అభిషేక్ బాదులు ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించాడు. కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తనదైన స్టైల్లో బౌండరీల వర్షం కురిపిస్తూ ఢిల్లీ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. అతనికి తోడుగా ట్రావిస్ హెడ్ (37), ఇషాన్ కిషన్ (25) మెరుపులు మెరిపించగా, చివర్లో హెన్రిచ్ క్లాసెన్ కేవలం 12 బంతుల్లోనే 33 పరుగులు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయగా, మిగిలిన వారందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖేష్ కుమార్, నితీష్ రాణా, లుంగీ ఎన్గిడి లాంటి అనుభవజ్ఞులు కూడా అభిషేక్ ధాటికి తలవంచక తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ కేవలం 2 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఎక్స్ట్రాల రూపంలో వచ్చిన 8 పరుగులు కలిపి ఢిల్లీ ముందు 243 పరుగుల హిమాలయమంత లక్ష్యాన్ని ఉంచారు.

