కలం, నేషనల్ డెస్క్ : తెలంగాణలో ‘సర్’ (Telangana SIR) ప్రక్రియ వచ్చే నెల 25 (జూన్) నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ సంవత్సరం అక్టోబరు 1ను క్వాలిఫైయింగ్ తేదీగా నిర్ణయించింది. సర్ ప్రక్రియ కోసం శిక్షణ, పత్రాల ముద్రణ జూన్ 15న ప్రారంభం కానున్నది. మొత్తం 30 రోజుల పాటు సర్ ప్రక్రియ జరగనున్నది. బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికీ తిరిగి అర్హత కలిగిన ఓటర్ల వివరాలను సేకరిస్తారు. అర్హులైనవారి పేర్లు జాబితాలోక చేరుస్తారు. జాబితాలో నిర్ధారణ అయ్యే ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ జూలై 24న ఖరారవుతుంది. ఈ ఓటర్ల పేర్లతో కూడిన ముసాయిదా జాబితాను ఎలక్షన్ కమిషన్ జూలై 31న ప్రచురిస్తుంది. అభ్యంతరాలు ఉన్నట్లయితే అదే రోజు (జూలై 31) నుంచి నెల రోజుల పాటు (ఆగస్టు 30 వరకు) ఎలక్షన్ కమిషన్కు తెలియజేయవచ్చు.
అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు అందుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ (Election Commission) వాటిని పరిశీలించి సెప్టెంబరు 28వ తేదీకల్లా క్లియర్ చేయాలి. అప్పటికి ఖరారైన ఓటర్ల పేర్లతో తుది జాబితాను కమిషన్ అక్టోబరు 1న ఫైనల్ చేస్తుంది. దాన్ని పబ్లిక్ డొమెయిన్లో పెట్టనున్నది. తెలంగాణలో మొత్తం 35,985 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు, వారికి సహాయకులుగా 25,886 మంది బూత్ లెవల్ అసిస్టెంట్లు ‘సర్’ (Telangana SIR) ప్రక్రియలో పాల్గొంటారు. మొత్తం 3,39,20,705 మంది ఓటర్లు ఉన్నట్లు మే 12 నాటి లెక్కల ప్రకారం ఎలక్షన్ నిర్ధారణకు వచ్చింది. ‘సర్’ ప్రక్రియలో ఎంత మంది పేర్లు గల్లంతవుతాయి.. కొత్తగా ఎంతమంది చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తెలంగాణలో ఇంటింటి సర్వే చేస్తూ జనగణన (హౌజ్ లిస్టింగ్) ప్రక్రియ జరుగుతున్నది. ఇది జూన్ 9న ముగియనున్నది. అది పూర్తికాగానే ‘సర్’ ప్రక్రియ మొదలవుతుంది.
Read Also: బైక్పై అసెంబ్లీకి దేవేంద్ర ఫడ్నవీస్.. వీడియో వైరల్
Follow Us On: Instagram

