కలం, మహబూబ్నగర్ బ్యూరో : వనపర్తి (Wanaparthy) జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన, ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో(Adarsh Surabhi) కలిసి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న పలు నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు ప్రాజెక్టుల భూసేకరణ పనులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
గణపసముద్రం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న 197 ఎకరాలలో 164 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు వివరించారు. రైతులతో చర్చించి అవార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ సూచించారు. కర్నెతండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన 17 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలను సోమవారంలోగా పంపించాలని ఆదేశించారు. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్యాకేజ్-29 కింద మైనర్ కెనాల్స్కు అవసరమైన 77 ఎకరాల భూసేకరణ కోసం పెగ్ మార్కింగ్ పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ఘనపూర్ బ్రాంచ్ కెనాల్కు సంబంధించిన భూముల విషయంలోనూ పెండింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బుద్ధారం పెద్దచెరువు, ఖాన్ చెరువు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. అటవీ భూములకు సంబంధించిన అనుమతులను సంబంధిత శాఖల సమన్వయంతో త్వరగా పొందాలని సూచించారు. ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూముల యజమానులకు టోకెన్లు రూపొందిస్తే నగదు బదిలీ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రహీముద్దీన్, ఎస్ఈ చంద్రశేఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే ఏడి శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.

