కలం, మెదక్ బ్యూరో : ఎన్నికల సామాగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (CEO Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు) గోడౌన్ లో సుదర్శన్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గోడౌన్ సీళ్లను తెరిపించి, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఈవో కీలక సూచనలు చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. యంత్రాల భద్రత, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు ఇతర ఎన్నికల పరికరాల నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సీఈవో సుదర్శన్ రెడ్డి అధికారులను అదేశించారు.

