కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు (Telangana Panchayats) జాతీయ స్థాయిలో మరోసారి తమ సత్తా చాటాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన రెండు గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి. గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ గుర్తింపు లభించింది.
ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలానికి చెందిన మోతుకుపల్లి (Mothukupalle) గ్రామ పంచాయతీ ఉత్తమ పరిపాలన విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. గ్రామ స్థాయిలో పారదర్శకమైన పాలన అందించడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడంలో మోతుకుపల్లి చూపిన ప్రతిభను కేంద్రం గుర్తించింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలానికి చెందిన ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. మహిళా సాధికారత, భద్రత, వారి సంక్షేమ కార్యక్రమాల అమలులో ఈ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది.
మంత్రి సీతక్క హర్షం..
ఈ విజయంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క (Minister Seethakka) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామాలు (Telangana Panchayats) జాతీయ వేదికపై మెరవడం గర్వకారణమని ఆమె కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని, దానికి ఈ అవార్డులే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. అవార్డులు సాధించిన మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామ ప్రజాప్రతినిధులను, అధికారులను, గ్రామ ప్రజలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయాలు రాష్ట్రంలోని మిగిలిన గ్రామ పంచాయతీలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: కేసీఆర్ డైలాగ్ చెప్పిన కవిత
Follow Us On: X(Twitter)

