కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ప్లాస్టిక్ దుకాణాలు, స్వీట్ హోంలు, బేకరీలు, మిల్క్ సెంటర్లలో తనిఖీలు చేపట్టి నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులపై మొత్తం రూ.8 వేల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని దుకాణదారులకు సూచించారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులను వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మున్సిపల్ అధికారులకు సహకరించాలని అన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని కొనసాగిస్తే ఇకపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రజిని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

