కలం, జోగులాంబ గద్వాల: గద్వాల నియోజకవర్గ రైతాంగం చిరకాల స్వప్నమైన నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం నీటి నిల్వ సామర్థ్యాన్ని 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ, ఇందుకు రూ. 1,781 కోట్ల నిధులను మంజూరు చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు, గూడెందొడ్డి రిజ్వాయర్ సామర్థ్యాన్ని 1.9 టీఎంసీల నుండి 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనకు కూడా ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర క్యాబినేట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. దీనికి కృతజ్ఞతగా గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) ఆధ్వర్యంలో నాయకులు, రైతులు సోమవారం హైదరబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనపై ఉందని, అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నా వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో గద్వాల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రత్యేకమైన నిధులు కేటాయించి గద్వాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మీరంతా అండగా ఉండాలని తెలిపారు.
ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గ రైతాంగం, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన నీటిపారుదల గట్టు ఎత్తిపోతల పథకం, గూడెందొడ్డి రిజర్వాయర్లకు నిధులు కేటాయించడం చాలా సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.
రైతాంగానికి శాశ్వతమైన నీటి సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దూరదృష్టతో ఆలోచించిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున, రైతాంగం తరఫున హృదయపూర్వక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజా ప్రతినిధులు, గద్వాల నియోజకవర్గ రైతాంగం, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

