కలం, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన యువజన, క్రీడా వారోత్సవాలు (Sports Week Celebrations) సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా జుంబా కార్యక్రమం అందరినీ ఆకట్టుకోగా, మంత్రులు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.
అనంతరం మంత్రులు వాకిటీ శ్రీహరి, పొన్నం ప్రభాకర్ 5కే మారథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 2 వేల మందికి పైగా యువ క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుండి ప్రారంభమై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, బూర్గుల రామకృష్ణారావు భవనం, ఈగల్ సర్కిల్, ఆర్బీఐ, అసెంబ్లీ కంట్రోల్ రూమ్ మీదుగా ఎల్బీ ఇండోర్ స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగింది. అనంతరం ఇండోర్ స్టేడియంలో దివ్యాంగులు, మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన యోగా, మెడిటేషన్ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
Read Also: గుడ్లు తింటున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి ముప్పే!
Follow Us On: WhatsApp

