కలం, తెలంగాణ బ్యూరో : డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశానికే తెలంగాణ ‘రోల్ మోడల్’గా నిలిచింది అని ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు (Minister Duddilla Sridhar Babu) అన్నారు. ప్రజల ముంగిటకే ప్రభుత్వ, పౌర సేవలను అందిస్తామని, ఇందుకోసం త్వరలోనే ‘కాంప్రహెన్సివ్ రోడ్మ్యాప్’ సిద్ధమవుతుందన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, అందులో భాగంగానే ప్రజలకు మెరుగైన సేవలందించేలా డిజిటల్ రూపంలో సౌకర్యవంతమైన ప్లాట్ ఫామ్ తీసుకురానున్నమని తెలిపారు. ‘డిజిటల్ ఫైనాన్స్ సమ్మిట్’ లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్లో అనేక రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోనే సరికొత్త రోల్ మోడల్ తెలంగాణ అని ఆయన (Minister Duddilla Sridhar Babu) అన్నారు. ప్రభుత్వానికి చెందిన పథకాలు, వివిధ రూపాల్లో అందాల్సిన సిటిజెన్ సర్వీసులు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నేరుగా ప్రజల ముంగిటకే చేర్చడానికే సమగ్ర రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నామన్నారు.
గ్లోబల్ ఎకానమీకి ‘గ్రోత్ ఇంజన్’గా తెలంగాణ :
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతున్నదని, సంప్రదాయ పద్ధతుల స్థానంలో వ్యవస్థను రీ-డిఫైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, డిజిటల్ పేమెంట్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్నదని అన్నారు. ఈ గ్లోబల్ డిజిటల్ రేసులో భారత్కు తెలంగాణ ఒక ‘గ్రోత్ ఇంజన్’లా మారిందన్నారు. భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్.. ఈ మూడింటినీ అనుసంధానించేలా ఒక బలమైన ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
టెక్నాలజీతో పాటు పెరుగుతున్న సైబర్ సవాళ్లు :
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల కారణంగా ఫైనాన్స్ రంగంలో సరికొత్త అవకాశాలు వస్తున్నాయని, అదే స్థాయిలో సవాళ్లు కూడా పెరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. డీప్ ఫేక్స్, సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ లాంటి మోసాలు ఎక్కువవుతున్న తరుణంలో, ‘సైబర్ అష్యూరెన్స్’కు ప్రాధాన్యత పెరిగిందన్నారు. మారుతున్న ట్రెండ్స్కు అనుగుణంగా స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్పై దృష్టి పెట్టాలని సూచించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందునే స్కిల్ వర్శిటీతో విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నామన్నారు.

