కలం, ఖమ్మం బ్యూరో: రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని కొత్తగూడెం (Kothagudem) ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేషన్ డీలర్ల సమావేశం శుక్రవారం పట్టణంలోని మార్వాడి సత్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్ల పాత్ర కీలకమైనదని, నిరుపేదలకు సక్రమంగా రేషన్ అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీలర్లు ఎదుర్కొంటున్న ప్రతి న్యాయమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. విధుల్లో ఎలాంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని డీలర్లకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు మాచర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

