కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల (Inter Admissions)కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇటీవల ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి తాత్కాలికంగా నిలిపివేసింది. మే 4న విడుదల చేసిన సర్క్యులర్ను రద్దు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
విద్యా వ్యవస్థలో కొన్ని ప్రధాన మార్పులు తీసుకురావాలని రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అడ్మిషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు ఉండనున్నాయని అధికారులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాత షెడ్యూల్ను అమలు చేయకుండా నిలిపివేసి, కొత్త మార్గదర్శకాలను రూపొందించే పనిలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, గురుకుల, మోడల్ జూనియర్ కాలేజీలు అన్ని ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఎటువంటి అడ్మిషన్లు చేపట్టకూడదని స్పష్టం చేసింది.
సవరించిన అడ్మిషన్ షెడ్యూల్తో పాటు పూర్తి నిబంధనలు త్వరలోనే విడుదల చేస్తామని బోర్డు తెలిపింది. పదో తరగతి ఫలితాల తర్వాత అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. తాజా సమాచారం కోసం బోర్డు అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు.
Read Also: ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On : WhatsApp

