కలం, వెబ్ డెస్క్: దానం నాగేందర్ (Danam Nagender)కు తెలంగాణ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పును కొట్టివేయాలని, దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరిగింది. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ నుంచి లోకసభ ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేశారని కోర్టుకు తెలిపారు.
ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయవాది ప్రస్తావించారు. స్పీకర్ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఏజీగా ఉండి స్పీకర్ తరఫున ఎలా వాదిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. తాను సీనియర్ న్యాయవాదిగా హాజరవుతున్నానని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, దానం నాగేందర్ (Danam Nagender) కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
Read Also: కాలుష్యాన్ని పెంచుతున్న కంపెనీలను ORR బయటకు పంపిస్తాం : సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

