కలం, వెబ్డెస్క్: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల అక్రమాల (JPSC Exam Scam) వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఆదివారం ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చిన ఈడీ తొలి కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ఈ కేసు నమోదైంది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేసేందుకు ఈడీ ఒక ఈసీఐఆర్ నమోదు చేసింది. జార్ఖండ్ క్రైమ్ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈఈసీఐఆర్ దాఖలు చేశారు.
ఈ పరీక్షా కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మనీ ట్రైల్ను ఈడీ పరిశీలించనుంది. ఈ అక్రమాలలో భారీ ఎత్తున డబ్బు చేతులు మారిందా లేదా అనే కోణంలో ఆరా తీయనున్నారు. నిధుల మూలాలు, డబ్బు చేతులు మారడం, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి వారి పాత్రను నిర్ధారించడానికి ఈడీ దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది.
ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రాంచీ యూనిట్ నుండి ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నలుగురు ఇన్స్పెక్టర్లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం రంగంలోకి దిగింది. ఇదిలా ఉండగా జేపీఎస్సీ పరీక్షల అక్రమాలపై ఇప్పటికే 19 మంది అరెస్టు అయ్యారు. పరీక్షల రద్దు, సమగ్ర విచారణ, సంస్కరణలు కోరుతూ విద్యార్థులు ఆందోళనలు చేస్తుండటంతో ఈ అంశం రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపుతోంది.

