కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు అకాల వర్షం రైతులను నిలువునా ముంచేస్తోంది. మధ్యాహ్నం వేళలో భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెల్లడించింది. అన్ని జిల్లాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుందని అలర్ట్ (Heatwave Alert) జారీ చేసింది.
అయితే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ , కొమురంభీం జిల్లాల్లో దాదాపు నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వెల్లడించింది. ఈ నెల 12న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం మినహా మిగతా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండ వేడి దృష్ట్యా ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్నం వేళలో బయటకు రావొద్దని సూచించింది.

