కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రాబోయే ఐదు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు (Heat Wave) వీచే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఈ వడగాలుల తీవ్రత ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు కొనసాగుతుందని అంచనా వేశారు. భానుడి భగభగలకు తోడు ఉక్కపోత కూడా తోడవడంతో ఉభయ రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

