కలం, వెబ్ డెస్క్ : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) మండలం శివారు తండా పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి ఒక్కసారిగా పశువుల మందపై దాడికి తెగబడింది. ఈ క్రమంలో రైతు మోత్యా నాయక్కు చెందిన ఎద్దుపై దాడి చేసి ప్రాణాలు తీసింది. కంటికి రెప్పలా కాపాడుకున్న పశువు మృత్యువాత పడటంతో సుమారు 80 వేల రూపాయల మేర నష్టం వాటిల్లిందని సదరు రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను పరిశీలించగా పులి దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పులి సంచరిస్తున్న విషయాన్ని అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివారు తండా ప్రజలు, రైతులు పంట పొలాల వైపు వెళ్లవద్దంటూ అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవి వైపు వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.

