కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సర్కారు బడుల రూపురేఖలను పూర్తిగా మార్చే దిశగా భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో డిజిటల్ విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టి-ఫైబర్, బిఎస్ఎన్ఎల్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2,498 పాఠశాలలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కేవలం భవనాల అభివృద్ధికే కాకుండా బోధనా పద్ధతులలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
జిల్లాల వారీగా చూస్తే జగిత్యాలలో 789 పాఠశాలలు, కరీంనగర్ (Karimnagar) జిల్లాలో 654 పాఠశాలలు, పెద్దపల్లిలో 564 పాఠశాలలు, రాజన్న సిరిసిల్లలో 491 పాఠశాలలలో డిజిటలైజేషన్ పనులు చేపట్టనున్నారు. స్మార్ట్ బోర్డులు, ప్రొజెక్టర్లు, వర్చువల్ క్లాసులు, ఆన్లైన్ పరీక్షల ద్వారా విద్యార్థులకు ఆధునిక బోధన అందించనున్నారు. క్లిష్టమైన సబ్జెక్టులను యానిమేషన్, వీడియోల రూపంలో వివరించడం ద్వారా విద్యార్థులలో ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులు స్వయంగా సైన్స్ మోడల్స్ తయారు చేసేలా ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తున్నారు. మారుమూల పల్లెలలోని విద్యార్థులకు కూడా ప్రపంచ స్థాయి విద్య అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలుస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Read Also: నా కొడుకు నిప్పు… నిందలు వేసినవాళ్ళను వదిలిపెట్టను: బండి సంజయ్
Follow Us On: Instagram

