కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi Centres) అల్పాహారం పెట్టే పథకానికి శ్రీకారం చుట్టనుంది. చిన్నారులకు ప్రతి రోజు నాణ్యమైన పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తోంది. ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి బ్రేక్ ఫాస్ట్ (Breakfast)లో భాగంగా ఉప్మా, కిచిడీ, పాలు అందించనున్నారు.
ముందుగా ఎంపిక చేసిన రెండు జిల్లాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించనున్నారు. ఈ నెల 12 నుంచి ఈ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం మొదలు కానుంది. ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట నెల రోజుల పాటు పథకం అమలును పరిశీలించి, ఆ తర్వాత లోటుపాట్లను సరిదిద్దుకోనున్నారు. ఈ రెండు జిల్లాల్లో ప్రోగ్రామ్ విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఏడాదిలో 300 రోజుల పాటు చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు.

