కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో(Telangana) ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్లను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం నిర్వహించే రెండు రెగ్యులర్ టెట్లతో పాటు, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయుల కోసం అదనంగా రెండు టెట్లు నిర్వహించనుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హతను తప్పనిసరి చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టెట్ అర్హత లేని ఇన్-సర్వీస్ టీచర్లకు అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్లు (Special TET) నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగంలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సి ఉండటంతో, వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వేలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరో అవకాశం లభించనుంది. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే ఈ ప్రత్యేక టెట్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మార్గదర్శకాలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ నిర్ణయం ఉపాధ్యాయ వర్గాలలో ఆనందం వ్యక్తం చేస్తోంది.

