తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె పాత ఓఎస్డీ అంశం తీవ్ర వివాదానికి దారితీసింది. మాజీ ఓఎస్డీ సుమంత్(OSD Sumanth) వ్యవహారంలో కొండా సురేఖ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఆమె ఆఫీసుకు సంబంధించి అన్ని ఫైళ్లను అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా కొండా సురేఖ నివాసం దగ్గర నుంచి భద్రతను తొలగించారు. మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు ఔట్ పోస్ట్ను కూడా పోలీసులు తొలగించారు. దీంతో కొండా వివాదం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈసారి కొండా సురేఖకు పదవీ భంగం తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఇటీవల మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఓఎస్డీగా సుమంత్ను ప్రభుత్వం తొలగించింది. సుమంత్.. హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్(Deccan Cements) కంపెనీ వారిని డబ్బుల ఇవ్వాలని గన్ పెట్టి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటి నేపథ్యంలోనే అతనిపై కేసు నమోదయింది. కాగా, బుధవారం రాత్రి కొండా సురేఖ పాత ఓఎస్డీ సుమంత్ ఉన్నారన్న సమాచారం రావడంతో అతనిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆమె నివాసం దగ్గర భారీ హైడ్రామా నెలకొంది. ఈ క్రమంలో పోలీసులపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. దీంతో రచ్చ మరింత అధికమైంది.
Read Also: కాంగ్రెస్ అలా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా: దీపక్

