కలం, వెబ్ డెస్క్: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 4473 మంది కి రూ.48.79 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. గత వారానికి సంబంధించి రూఫ్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసిన 1969 మంది లబ్ధిదారులకు రూ.17.23 కోట్లు, స్లాబ్ పూర్తి చేసిన 2504 మందికి రూ.31.56 కోట్లు విడుదల చేశారు.
రూ.5376.22 కోట్ల విడుదల
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.5376.22 కోట్లను విడుదల చేసినట్లు ఎండీ గౌతం తెలిపారు. బేస్ మెంట్ నిర్మాణం పూర్తి అయిన వాటికి రూ. 2125.98 కోట్లు, గోడలు పూర్తి అయి రూఫ్ లెవల్ వరకు వచ్చిన ఇండ్లకు రూ.1518.51 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే స్లాబ్ పూర్తి అయిన వాటికి రూ.1731.73 కోట్లు విడుదల చేశామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్ల పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. వాటిలో ఇంతవరకు 1,13,365 ఇండ్ల స్లాబు పూర్తి అయ్యిందని, 34,552 ఇండ్లు రూఫ్ లెవల్ (గోడల నిర్మాణం పూర్తి) దశలో ఉన్నాయన్నారు. మరో 61 వేల ఇండ్ల బేస్ మెంట్ నిర్మాణాలు పూర్తి అయ్యాయని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లక్ష ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

