కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సెలవు (Bakrid Holiday) తేదీ మారింది. పూర్వం ప్రకటించిన తేదీలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ నెల 27వ తేదీ బుధవారానికి బదులుగా, 28వ తేదీ గురువారాన్ని అధికారిక సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వఖ్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ (ఎన్.ఐ యాక్ట్) 1881 కింద ఈ సవరించిన ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జీవో నెంబర్ 718 ద్వారా అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ మార్పునకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గెజెట్లో ప్రచురించాల్సిందిగా ప్రింటింగ్, స్టేషనరీ విభాగ కమిషనర్ను ఆదేశించారు. మారిన సెలవు దినం గురించిన సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమాచార, పౌర సంబంధాల శాఖను కోరారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు, ఆర్థిక సంస్థలకు ఈ సవరించిన ఉత్తర్వులు వర్తిస్తాయి.

