కలం, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు (RTC Bus Fire) చెలరేగడం తీవ్ర కలకం రేపింది. జగయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. గొల్లపూడి సమీపానికి చేరుకున్న సమయంలో బస్సు ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వచ్చి పొగలు అలముకొన్నాయి. పరిస్థితిని గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. కొందరు తలుపుల ద్వారా బయటకు దిగారు. మరికొందరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బస్సు కిటికీల గుండా బయటకు దూకేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేస్తున్న అధికారులు.. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఎండల కారణంగా ఇంజిన్ అధికంగా వేడెక్కి ఇలా జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

