కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయం నేడు ఒక కీలక పరిణామానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ భేటీలో ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పొదుపు చర్యలతో పాటు విద్యుత్ సంస్కరణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. నష్టాల్లో ఉన్న డిస్కంలను గట్టెక్కించేందుకు అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జూన్ రెండు నుంచి రాష్ట్రంలో రైతు డిస్కం అమలు చేయాలనే యోచనలో సర్కార్ ఉంది. ఇందులో భాగంగా పంప్సెట్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, కొండారెడ్డిపల్లి గ్రామం తరహాలో రాష్ట్రంలో మరికొన్ని సోలార్ విలేజెస్ను ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారు. అలాగే ఇంధన వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తప్పనిసరి చేయడం, సోలార్ స్టౌ స్కీంను ప్రవేశపెట్టడం వంటి వినూత్న ప్రతిపాదనలపై కేబినెట్ ముద్ర వేయనుంది.
వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల మార్పిడి దిశగా రైతులకు దిశానిర్దేశం చేసేలా ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను రూపొందించనున్నారు. దీంతో పాటు పేద ప్రజల భద్రత కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాలను ఖరారు చేయనున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిధుల కేటాయింపులపై స్పష్టత రానుంది. త్వరలోనే రానున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేయనున్నారు.

