కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని(Yadagirigutta) ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వేసవి సెలవుల కారణంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండగా.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన నేపథ్యంలో అధికారులు విధించిన ఆంక్షలు సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీఎం భద్రతా ఏర్పాట్ల పేరుతో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొండ కింద నుంచి పైకి భక్తులను ఉచితంగా తీసుకెళ్లే బస్సు సర్వీసులను అకస్మాత్తుగా నిలిపివేయడంతో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. కాలినడకన కొండపైకి వెళ్లలేని వారు ఎండలోనే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేసవి ఎండ తీవ్రతకు తోడు త్రాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడంతో భక్తులు అల్లాడిపోతున్నారు. దేవాదాయ శాఖ, పోలీస్ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంతో కష్టపడి కొండపైకి చేరుకున్న భక్తులకు దర్శనం కూడా దూరమైంది. సీఎం రేవంత్ రెడ్డి దర్శనం పూర్తయ్యే వరకు సామాన్య భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని అధికారులు చెప్పడంతో క్యూలైన్లలో గంటల తరబడి చిన్నారులతో పాటు భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. “స్వామివారి దర్శనం కోసం ఎంతో దూరం నుంచి వస్తే.. సీఎం పర్యటన పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఉన్న బస్సులను కూడా నిలిపివేశారు. సామాన్య భక్తుల కష్టాలు ఎవరికి కనిపించడం లేదా?” అంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా ఏర్పాట్లు అవసరమే అయినప్పటికీ.. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

