కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లాలో ఖాళీగా ఉన్న 14 టెక్నికల్ అసిస్టెంట్, 1 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీ ప్రక్రియ అభాసుపాలైంది. ఉద్యోగాల (Jobs) భర్తీ నిర్వహణ సరైన పద్ధతిలో జరగకపోవడంతో అభ్యర్థులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. దాదాపు 300 మంది దరఖాస్తు చేసుకోగా, అధికారులు మాత్రం 101 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి రాత్రి 11 గంటలకు మెసేజ్లు పంపి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రావాలని ఆదేశించారు. తీరా అక్కడికి చేరుకున్న అభ్యర్థులకు అధికారులు షాక్ ఇచ్చారు. ముందస్తు సమాచారం లేకుండానే పరీక్ష నిర్వహించడంతో అభ్యర్థులు షాక్ అయ్యారు.
పండుగ పూట పరీక్షలా?
రంజాన్ రోజు పరీక్షలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందుస్తు సమాచారం లేకుండా అభ్యర్థులను పిలవడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నించారు. తమకు నచ్చిన వారికి ఉద్యోగాలిచ్చుకోవడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అభ్యర్థులు ఆరోపించారు.
అభ్యర్థుల నిరసన
షార్ట్ లిస్ట్ అయిన 101 మందిలో కేవలం 89 మందిని మాత్రమే పరీక్షకు అనుమతించారు. మిగిలిన 11 మందిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టర్, అధికారులు కుమ్మక్కై పోస్టులను అమ్ముకున్నారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రక్రియను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
Read Also: తెలంగాణకి మోదీ.. గ్రాఫ్ పెరిగేలా పొలిటికల్ స్కెచ్
Follow Us On : WhatsApp

