కలం, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న వేళ మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన కోల్కతా నైట్రైడర్స్(KKR) జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరం అవుతున్నారు. ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీకి దూరం అయ్యాడు. ఇప్పుడు ఆ జట్టు స్టార్ పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ సెమీఫైనల్ ఆడుతున్నప్పుడే ఆకాశ్ దీప్ వెన్నునొప్పి బారినపడ్డాడు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అతడు జట్టుకు దూరం అయ్యాడు.
గతేడాది అబుదాబిలో జరిగిన మినీ వేలంలో కేకేఆర్ జట్టు ఆకాశ్ను రూ.1 కోటికి కొనుగోలు చేసింది. ఈ టోర్నీకి ఆకాశ్ (Akash Deep) అందుబాటులో లేకపోవడం ఆ జట్టు బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బగా మారనుంది.కాగా, 2022లో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన ఆకాశ్.. నాలుగు సీజన్లలో కేవలం 14 మ్యాచ్లే ఆడాడు. 10 వికెట్లు తీశాడు. గత సీజన్లో అతడు లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు. వేలంలో అతడిని 8 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో అతడు 6 మ్యాచ్ల్లో 3 వికెట్లే తీశాడు. ఇదిలాఉంటే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానా ను వేలంలో రూ.18 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. అయితే అతడు గాయం నుంచి కోలుకున్నప్పటికి కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. అతడు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్ఓసీ ని పొందాల్సి ఉంది. దీంతో అతడు ఎప్పుడు జట్టుతో చేరతాడో తెలియని పరిస్థితి ఉంది.
గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. ఇది జట్టు కూర్పుపై పెను ప్రభావం చూపనుంది. అంతేకాదు కీలక ఆటగాళ్ల లేమి కూడా అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం కేకేఆర్ జట్టులో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి లు మాత్రమే భారత పేసర్లు. ఇక ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్తో కొన్ని ఓవర్లు వేయించే అవకాశం కూడా కేకేఆర్కు ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు ముంబైలోని వాంఖడే మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది.
Read Also: తెలంగాణకి మోదీ.. గ్రాఫ్ పెరిగేలా పొలిటికల్ స్కెచ్
Follow Us On: X(Twitter)

