కలం, వెబ్ డెస్క్: ఒక వర్షం మ్యాచ్ను మాత్రమే కాదు, ఆస్ట్రేలియా (Australia) ప్రయాణాన్నీ ఆపేసింది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఐర్లాండ్తో జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో జింబాబ్వే సూపర్ 8 దశకు అర్హత సాధించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అధికారికంగా బయటకెళ్లిపోయింది. గ్రూప్ బీ కీలక పోరు వర్షంతో నిలిచిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. జింబాబ్వే పాయింట్లు ఐదుకు చేరాయి. గ్రూప్ నుంచి శ్రీలంక తర్వాత రెండో జట్టుగా సూపర్ ఎయిట్కు చేరింది.
ఆస్ట్రేలియా (Australia) ఇప్పటికే బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. వారి ఆశలు జింబాబ్వే ఓడిపోవడంపై ఆధారపడ్డాయి. ఐర్లాండ్, ఒమన్పై జింబాబ్వే పరాజయం చెందితేనే అవకాశాలు ఉండేవి. అలా జరిగితే ఆస్ట్రేలియా చివరి మ్యాచ్లో ఒమన్పై భారీ విజయం సాధించి నెట్ రన్రేట్ ఆధారంగా ముందుకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ జింబాబ్వే, ఐర్లాండ్కు వచ్చిన పాయింట్లు ఆ మార్గాన్ని పూర్తిగా మూసేశాయి.
ఇప్పుడైనా చివరి మ్యాచ్ గెలిచినా ఆస్ట్రేలియా గరిష్టంగా నాలుగు పాయింట్లకే పరిమితం అవుతుంది. ఈ లెక్కన పోటీలో ఉండే అవకాశం లేకుండా పోయింది. పురుషుల టీ20 ప్రపంచకప్ (T20 World Cup) చరిత్రలో గ్రూప్ దశలోనే ఆస్ట్రేలియా బయటపడటం ఇది రెండోసారి. ఐర్లాండ్ కూడా టోర్నీకి వీడ్కోలు పలికింది. ఒమన్పై ఒక్క విజయం మాత్రమే సాధించి మూడు పాయింట్లతో ప్రయాణం ముగించింది. ఈ పరిణామంతో గ్రూప్ బీ సమీకరణాలు స్పష్టమయ్యాయి. జింబాబ్వే సూపర్ ఎయిట్కు చేరగా, ఆస్ట్రేలియా కథ ఇక్కడితో ముగిసింది.
Read Also: కొలువుదీరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. మంత్రిగా హిందూ ఎంపీ
Follow Us On: Instagram


